విశాఖపట్నం, సిటిజన్ టైమ్స్, ఏప్రిల్ 23 : భగీరథ మహర్షి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ప్రారంభంలో భగీరథ మహర్షి చిత్రపటానికి ముగడ రాజారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ముగడ రాజారావు ప్రధానంగా మాట్లాడుతూ, భగీరథుడు కేవలం పురాణపాత్ర కాదని, సంకల్పం, పట్టుదలకు ప్రతీక అని పేర్కొన్నారు. అసాధ్యంగా కనిపించే పనులను కూడా నిరంతర కృషి, సహనం, అచంచల దీక్షతో సాధించవచ్చని తెలిపారు. గంగను భూమిపైకి తీసుకురావడం భగీరథుని తపస్సుకు నిదర్శనమని వివరించారు. అందుకే కఠినమైన పనులను “భగీరథ ప్రయత్నం”గా అభివర్ణిస్తారని చెప్పారు. జీవితంలో సమస్యలు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిన వారికే విజయం దక్కుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఎవరైనా సరే క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తే లక్ష్యాలను చేరుకోవచ్చని రాజరావు సూచించారు. ప్రభుత్వ సేవలో ఉన్న అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించడాన్ని బాధ్యతగా కాకుండా సేవగా భావించాలని అన్నారు. ఫైళ్ల పరిష్కారంలో ఆలస్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకుని వేగంగా, పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.యువత స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమల వైపు దృష్టి పెట్టాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ వనరులను ఉపయోగించుకుని వ్యాపారాలు ప్రారంభిస్తే ఆర్థికంగా ఎదగవచ్చని తెలిపారు. అనంతరం డిఆర్ఓ గోవిందరావు, బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వరి సంక్షిప్తంగా మాట్లాడుతూ భగీరథుని స్పూర్తితో ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
భగీరథ స్పూర్తితో ప్రజాసేవ చేయాలి: ముగడ రాజారావు
0
30
Previous article
Next article
